ట్రైబల్ హాస్టల్ లో మూడు రోజులుగా నీళ్లు బంద్
గిరిజన హాస్టల్ లో తాగునీటి కష్టాలు – స్పందించిన అధికారులు
పొలిటికల్ పవర్, సెప్టెంబర్ 09:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలోని గిరిజన వసతి గృహంలో విద్యార్థులు చుక్కనీటి కోసం పోరాటం చేయాల్సి వస్తోంది. గత మూడు రోజులుగా వసతి గృహంలో నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.బోరు మోటారు పాడవ్వడంతో పాటు మిషన్ భగీరథ నీరు కూడా రాకపోవడంతో తాగునీటికి, స్నానాలకు, మరుగుదొడ్లకు, బట్టలు ఉతుక్కోవడానికి కూడా నీరు లేక విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు.నీటి సమస్య పరిష్కరించాలంటూ విద్యార్థులు ఆందోళనకు దిగడంతో అధికార యంత్రాంగం స్పందించింది. దమ్మపేట తహసీల్దార్, డిప్యూటీ కలెక్టర్ (ట్రైనీ) హాస్టల్ ను సందర్శించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
గురువారం ఉదయం 11 గంటల్లోగా కొత్త బోరు వేయిస్తామని డిప్యూటీ కలెక్టర్ (ట్రైనీ) విద్యార్థులకు హామీ ఇచ్చారు. విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హాస్టల్ సిబ్బందిని హెచ్చరించారు. హాస్టళ్ల విషయంలో జిల్లా కలెక్టర్ అంకిత్ సీరియస్ గా ఉన్నారని, నిత్యం పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు.అధికారులు హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. అయితే ఇచ్చిన హామీని వెంటనే అమలు చేసి శాశ్వతంగా నీటి సమస్య లేకుండా చూడాలని వారు కోరుతున్నారు.
