జర్నలిస్ట్ కే.వీ.ఆర్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి హైదరాబాద్, జూలై 3: హైదరాబాద్లో డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ (డీఎంజేయూ) నాయకుడు, జర్నలిస్ట్ కే.వీ.ఆర్ నివాసంలోకి ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రవేశించి వ్యవహరించిన తీరుపై తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజేఏసీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ పోలీసులు యూనిఫాం లేకుండా, మహిళా పోలీసులు లేకుండానే ఇంట్లోకి ప్రవేశించి కుటుంబ సభ్యులతో దురుసుగా ప్రవర్తించారని టీజేఏసీ ఆరోపించింది. ఇది చట్టవిరుద్ధ చర్య మాత్రమే కాకుండా మానవ హక్కుల ఉల్లంఘనగా పేర్కొంది. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండా, చట్టబద్ధ విధానాలను పాటించకుండా తెలంగాణలోకి ప్రవేశించి చర్యలకు దిగడం ఆందోళనకరమని టీజేఏసీ అభిప్రాయపడింది. జర్నలిస్టులపై అక్రమ కేసులు నమోదు చేయడం, అర్ధరాత్రి అరెస్టులకు పాల్పడడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతమని పేర్కొంది. ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి రాష్ట్ర గౌరవాన్ని కాపాడాలని టీజేఏసీ కోరింది. అలాగే జర్నలిస్ట్ కే.వీ.ఆర్ను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని, ఘటనకు బాధ్యులైన పోలీసు అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. పత్రికా స్వేచ్ఛను, జర్నలిస్టుల భద్రతను ప్రభుత్వం హామీ ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు టీజేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కరుణాకర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బెల్లంకొండ జ్యోతి సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.

