పేద రోగుల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారుతున్నాయి
పొలిటికల్ పవర్ న్యూస్ సెప్టెంబర్ 1: జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో అత్యవసర వైద్య సేవలు పూర్తిగా పడకేసాయని, వైద్యాధికారుల తీవ్ర నిర్లక్ష్యం వల్ల పేద రోగుల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారుతున్నాయని జహీరాబాద్ పురపాలక సంఘం 36వ వార్డు కౌన్సిలర్ అప్పం శ్రావణ్ కుమార్ ఆరోపించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ఆసుపత్రిలో ఈసీజీ టెక్నీషియన్ గైర్హాజరు కావడం, అత్యవసర వైద్య పరీక్షల కోసం రోగులు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడటం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు. రెండు రోజుల క్రితం ఒక క్రిటికల్ పేషెంట్కు ఈసీజీ తీసేందుకు టెక్నీషియన్ లేకపోవడంతో వార్డు సిబ్బందితో పరీక్ష చేయించారని, తాజాగా మరోసారి అదే పరిస్థితి ఎదురవ్వడంతో డ్యూటీ సమయంలో టెక్నీషియన్లు ఎందుకు అందుబాటులో ఉండటం లేదని ఆయన ప్రశ్నించారు. గుండెపోటు లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో వచ్చే రోగులకు సకాలంలో ఈసీజీ తీయకపోతే వారి ప్రాణాలకే ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేశారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న సంబంధిత టెక్నీషియన్, బాధ్యులైన ఆసుపత్రి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని శ్రావణ్ కుమార్ ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు. నిత్యం వందలాది మంది నిరుపేదలు వైద్యం కోసం ఈ ఏరియా ఆసుపత్రిపైనే ఆధారపడతారని, అలాంటి చోట నిరంతరం అత్యవసర విభాగాలు పూర్తిస్థాయి సిబ్బందితో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులను కోరారు. తక్షణమే ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్ అప్పం శ్రావణ్ కోరారు..

