పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక /పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ మహేశ్వరం, జూన్ 14 2026: హైదరాబాద్ శివారులోని మహేశ్వరం నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జీహెచ్ఎంసీ 67వ మంకల్ డివిజన్ పరిధిలోని హర్షగూడ గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ ఉపసర్పంచ్ రవి నాయక్ ఆధ్వర్యంలో సుమారు 50 మంది నాయకులు, కార్యకర్తలు మరియు మాజీ ప్రజాప్రతినిధులు మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్ర రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి చేరిన వారిని సాదరంగా ఆహ్వానించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై పార్టీ తీర్థం పుచ్చుకున్నట్లు చేరిన నాయకులు తెలిపారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని, ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూచించారు. హర్షగూడ గ్రామంలో జరిగిన ఈ భారీ చేరికలతో మహేశ్వరం నియోజకవర్గంలో బీఆర్ఎస్ మరింత బలోపేతం అవుతుందని పార్టీ నాయకులు అభిప్రాయపడ్డారు.
