నీటి వనరులను పొదుపుగా వినియోగించడం ప్రతి ఒక్కరి బాధ్యత
పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజ శేఖర్ జులై 20 2026: మహబూబ్నగర్, ఎల్నినో ప్రభావం కారణంగా రాష్ట్రంలో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు సాంప్రదాయ వ్యవసాయ పంటల కంటే హార్టికల్చర్ (తోటల సాగు) పంటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు, ఎల్నినో నిపుణుల కమిటీ అధ్యక్షుడు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి సూచించారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఐడీఓసీ కార్యాలయంలో ఎల్నినో పరిస్థితులు, ఋతుపరమైన మార్పులు మరియు ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి, ఉమ్మడి పాలమూరు జిల్లాల కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ చిన్నారెడ్డి మాట్లాడుతూ… వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల్లో నీటి లభ్యత తక్కువగా ఉండే అవకాశమున్నందున వరి సాగును వీలైనంత మేర తగ్గించి, నీటి వినియోగాన్ని తగ్గించే పంటల వైపు రైతులను ప్రోత్సహించాలని సూచించారు. ఎల్నినో ప్రభావంతో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు తగ్గే అవకాశమున్నందున ఉపాధి హామీ పథకం కింద పెద్ద ఎత్తున పనులు చేపట్టి, అవసరమైతే సాధారణం కంటే ఎక్కువ రోజుల ఉపాధి కల్పించేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులను కోరారు. నీటి వనరులను పొదుపుగా వినియోగించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ, చెరువులు, కుంటలు, కాలువలను సంరక్షించి వర్షపు నీటిని నిల్వ చేసుకునే చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వం అందించే పథకాలు, సాంకేతిక సలహాలను రైతులు సద్వినియోగం చేసుకొని పంటల సాగు చేపట్టాలని అన్నారు. పశువులకు తాగునీరు, మేత కొరత ఏర్పడకుండా మేత విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలని, గ్రామస్థాయిలో నీటి నిర్వహణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ప్రతి గ్రామంలో విస్తృతంగా మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడవచ్చని తెలిపారు. రైతులు పంట బీమా పథకాలలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని, శాస్త్రవేత్తలు మరియు వ్యవసాయ అధికారుల సూచనలను పాటించడం ద్వారా పంట నష్టాలను తగ్గించుకోవచ్చని పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు ప్రజల్లో అవగాహన పెంచాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రకృతిని సంరక్షించడం ద్వారా భవిష్యత్ తరాలకు సురక్షితమైన వాతావరణాన్ని అందించవచ్చని, సమిష్టి కృషితో ఎల్నినో ప్రభావాన్ని అధిగమించి రాష్ట్ర అభివృద్ధిని కొనసాగిద్దామని డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి పిలుపునిచ్చారు.

