శ్రీ చైతన్య స్కూల్.. రూటే సపరేట్..! ఆదివారం సెలవు.. అయితే మాకేంటి..!
0
9
తక్షణమే ఎంఈఓ స్పందించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్
Most Popular
- Advertisment -
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో భాజ శేఖర్ సెప్టెంబర్ 07 2026: రంగారెడ్డి జిల్లా షాద్నగర్ రాష్ట్రంలోని పాఠశాలలకు ప్రభుత్వ నిబంధనలు ఒక విధంగా ఉంటే.. షాద్నగర్లోని శ్రీచైతన్య పాఠశాల మాత్రం మరో విధంగా వ్యవహరిస్తోందని ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ అన్నారు. ఆదివారం సెలవు దినమైనప్పటికీ పదో తరగతి విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు ఆయన పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ… విద్యార్థులకు వారంలో ఒక్కరోజైనా పూర్తిస్థాయి విశ్రాంతి అవసరమని, అయితే శ్రీచైతన్య పాఠశాలలో వారానికి ఏడు రోజులు తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం సెలవు రోజున విద్యార్థులు విశ్రాంతి తీసుకునే అవకాశం కల్పించాల్సి ఉండగా,ఆ రోజు కూడా పాఠశాలకు రప్పించడం సరైన విధానం కాదన్నారు.పాఠశాలలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు తరగతులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని, ఇంతటి సుదీర్ఘ సమయపాలనపై అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. సెలవు రోజుల్లోనూ పాఠశాల నిర్వహించడం వల్ల విద్యార్థులపై మానసిక ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.పాఠశాల ఉపాధ్యాయులను ఈ విషయంపై ప్రశ్నించగా.. తల్లిదండ్రుల నుంచి లేఖలు తీసుకున్న తర్వాతే సెలవు రోజుల్లో తరగతులు నిర్వహిస్తున్నామని చెప్పారని శ్రీకాంత్ తెలిపారు.అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం పాఠశాలలు నడుస్తాయా? లేక తల్లిదండ్రుల లేఖల ఆధారంగా నడుస్తాయా? అని ప్రశ్నించారు. నిబంధనలను పక్కనపెట్టి తల్లిదండ్రుల అనుమతి పేరుతో సెలవు రోజుల్లో తరగతులు నిర్వహించడం సమంజసం కాదన్నారు.విద్యార్థులు మార్కులు తక్కువ వస్తున్నాయనే కారణంతోనో, చదువులో తీవ్ర ఒత్తిడికి గురికావడం వల్లనో మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఉన్నాయని శ్రీకాంత్ పేర్కొన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యార్థులపై అధిక ఒత్తిడి పెంచకుండా,వారి మానసిక ఆరోగ్యం, విశ్రాంతికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.షాద్నగర్ స్థానిక ఎంఈఓ తక్షణమే స్పందించి శ్రీచైతన్య పాఠశాలలో జరుగుతున్న వ్యవహారాలపై పూర్తిస్థాయి విచారణ నిర్వహించి,ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే తగిన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ తరఫున శ్రీకాంత్ డిమాండ్ చేశారు.