న్యాయం జరిగే వరకు బాధిత కుటుంబానికి అండగా ఉంటాం
– ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షురాలు సయ్యద్ ఫర్హీన్ సుల్తానా
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ – ఖమ్మం జిల్లా ప్రతినిధి ఖమ్మం పట్టణంలోని రాపర్తి నగర్కు చెందిన 12 ఏళ్ల బాలికపై జరిగిన అత్యాచార ఘటన తీవ్ర కలకలం రేపిందని, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) పార్టీ అనుబంధ విద్యార్థి విభాగం ముస్లిం స్టూడెంట్ ఫెడరేషన్ (ఎంఎస్ఎఫ్) జిల్లా అధ్యక్షురాలు సయ్యద్ ఫర్హీన్ సుల్తానా ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి అమానుష ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా పోలీసు యంత్రాంగం మరింత అప్రమత్తంగా వ్యవహరించి గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న విద్యార్థిని జీవితం ఈ దారుణ ఘటనతో తీవ్రంగా దెబ్బతిన్నదని ఆమె పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణానికి పేరుగాంచిన ఖమ్మం నగరంలో ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరమని అన్నారు. నిందితుడికి కఠిన శిక్ష విధించి బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అలాగే ఈ ఘటనపై సమాజంలోని ప్రతి ఒక్కరూ స్పందించి బాధిత కుటుంబానికి మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం జరిగే వరకు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) పార్టీ అండగా ఉంటుందని సయ్యద్ ఫర్హీన్ సుల్తానా స్పష్టం చేశారు.
