ఆగి ఉన్న లారీని ఢీకొని ఇద్దరు యువతీయువకులు మృతి
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ జులై 29 20026: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై మరో విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ప్రణతి రెడ్డి (20), కత్రావత్ సురేందర్ (19) మంగళవారం ఉదయం కళాశాల నుంచి కారులో గండిపేట మీదుగా కొల్లూరుకు బయలుదేరారు. ఈ క్రమంలో నియోపోలిస్ ఎగ్జిట్ సమీపంలో రోడ్డుపై ఆగి ఉన్న లారీని వారి కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కత్రావత్ సురేందర్, ప్రణతి రెడ్డి ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఔటర్ రింగ్ రోడ్డుపై లారీలను నిర్లక్ష్యంగా నిలిపివేయడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరుసగా ప్రమాదాలు సంభవిస్తున్నప్పటికీ వాటిని నివారించేందుకు ప్రభుత్వం, సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

