ప్రభుత్వం వరి కొనుగోలులో నిర్లక్ష్యం వీడాలి
-బీజేపీ నాయకులు కిషన్ నాయక్
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 11 2026: పెద్దమందడి మండలంలో రైతులు ఆరుకాలం శ్రమించి పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని బీజేపీ సీనియర్ నాయకులు కిషన్ నాయక్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం వరి కొనుగోలు విషయంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆయన ఆరోపించారు. జిల్లాలో దాదాపు 180 రైస్ మిల్లులు ఉన్నప్పటికీ ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదన్నారు. రైస్ మిల్లులకు అలాట్మెంట్లు రావడం లేదని అధికారులు చెబుతూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. గన్ని బ్యాగులు అందుబాటులో లేవనే కారణాలతో కొనుగోళ్లు ఆలస్యం చేస్తున్నారని మండిపడ్డారు. రైతులు తెచ్చిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి నిల్వ ఉండటంతో నష్టపోతున్నారని తెలిపారు. అకాల వర్షాలు కురిస్తే రైతుల ధాన్యం తడిసి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అవసరమైన గన్ని బ్యాగులు, రవాణా సౌకర్యాలు కల్పించాలని కోరారు. రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరి విడనాడి వెంటనే వరి ధాన్యం సేకరణ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కిషన్ నాయక్ విమర్శించారు.
