2027 జనాభా లెక్కల స్వీయ గణన ప్రారంభం – ప్రజలు నమోదు చేసుకోవాలి: తహసిల్దార్ పాండు నాయక్
పొలిటికల్ పవర్ తెలుగు దునపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 04మే 2026: పెద్దమందడి మండల తహసిల్దార్ పాండు నాయక్ ప్రజలకు కీలక సూచనలు చేశారు. దేశవ్యాప్తంగా 2027 జనాభా లెక్కల కార్యక్రమంలో భాగంగా స్వీయ గణన (Self Enumeration) ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిందని తెలిపారు. ఈ ప్రక్రియ ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తహసిల్దార్ పాండు నాయక్ మాట్లాడుతూ… ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన అధికారిక వెబ్సైట్ ద్వారా ప్రజలు తమ కుటుంబ వివరాలను సులభంగా నమోదు చేసుకోవచ్చని సూచించారు. ముందుగా వెబ్సైట్ను ఓపెన్ చేసి, రాష్ట్రాన్ని ఎంపిక చేసి లాగిన్ కావాలని తెలిపారు. తరువాత కుటుంబ పెద్ద పేరు, మొబైల్ నంబర్ నమోదు చేసి OTP ద్వారా ధృవీకరణ పూర్తి చేయాలని చెప్పారు. ఒక కుటుంబానికి ఒకే మొబైల్ నంబర్ ఉపయోగించాలని స్పష్టం చేశారు. తదుపరి దశలో వినియోగదారులు తమకు అనుకూలమైన భాషను ఎంచుకుని, జిల్లా, గ్రామం లేదా పట్టణం, పిన్ కోడ్ వివరాలు నమోదు చేయాలని వివరించారు. అలాగే మొబైల్లో లొకేషన్ ఆన్ చేసి ఇంటి ఖచ్చితమైన స్థానాన్ని గుర్తించాలని సూచించారు. ఇళ్ల వివరాలకు సంబంధించిన మొత్తం 33 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి, ప్రీవ్యూ ద్వారా పరిశీలించి సమర్పించాలని తెలిపారు. వివరాలు సమర్పించిన తరువాత ‘H’ అక్షరంతో ప్రారంభమయ్యే 11 అంకెల ఎస్ ఈ ఐ డి లభిస్తుందని, దాన్ని భద్రపరచుకోవాలని తహసిల్దార్ సూచించారు. ఈ సదుపాయాన్ని వినియోగించుకుని ప్రజలు తమ కుటుంబ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
